ఏడాదికి 300 పుస్తకాలు, వేల కోట్ల వ్యాపారం, జనరల్ నరవాణే పుస్తక వివాదంతో వార్తల్లో నిలిచిన పెంగ్విన్

మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం చుట్టూ సాగుతున్న రాజకీయ వివాదం వల్ల పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పార్లమెంటులో రాహుల్ గాంధీ ఈ పుస్తకానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించిన నేపథ్యంలో, ఆ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని సంస్థ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో అసలు ఈ పబ్లిషింగ్ సంస్థ ఆదాయం ఎంత, ఇది ఏ దేశానికి చెందినది అనే ఆసక్తి పాఠకులలో పెరిగింది.
న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ అంతర్జాతీయ సంస్థ, గత 40 ఏళ్లుగా భారతీయ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ సుమారు రూ. 52,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, భారత్లో దీని ఆదాయం రూ. 405 కోట్లకు చేరుకుంది. ప్రతి సంవత్సరం సగటున 300కు పైగా కొత్త పుస్తకాలను ముద్రించే ఈ సంస్థ, కేవలం ఇంగ్లీష్లోనే కాకుండా తెలుగు, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ప్రస్తుతం 3,000కు పైగా పుస్తకాలతో బలమైన మార్కెట్ వాటాను కలిగి ఉంది.