ఆర్మీ ‘ఎయిర్క్రాఫ్ట్’ హ్యాక్.. ఇందులో నిజమెంత?

ఇంటర్నెట్డెస్క్: భారత సైన్యానికి (Indian Army) చెందిన ఓ మానవరహిత ఎయిర్క్రాఫ్ట్ (RPA)ను చైనా హ్యాక్ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు దర్శనమిచ్చింది.
దీనిపై తాజాగా ఆర్మీ స్పందించింది. ఆ పోస్టులో సమాచారాన్ని ఖండించింది. నిర్ధరించుకోని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని పోస్ట్ చేయడం మానుకోవాలని హెచ్చరించింది (India-China).
భారత ఆర్మీకి చెందిన ఆర్పీఏ ఆకస్మాత్తుగా చైనా భూభాగం వైపు దూసుకుపోయిందని, దానిని డ్రాగన్ హ్యాక్ చేసిందంటూ ఉన్న పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ”ఆ సమాచారమంతా పూర్తిగా నిరాధారం. అలాంటి ఘటన ఏదీ చోటుచేసుకోలేదు” అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ తరహా పోస్టులు తప్పుడు సమాచార వ్యాప్తికి, అనవసర ఆందోళనకు దారితీస్తాయని హెచ్చరించింది. అలాంటి వాటికి దూరంగా ఉండాలని మీడియా సంస్థలు, సోషల్ మీడియా యూజర్లకు సూచించింది. తన ఆస్తుల భద్రతకు ఆర్మీ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. ఆ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా కొన్ని నెలల క్రితం కీలక గస్తీ ఒప్పందం జరిగింది. 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. అయితే మళ్లీ ఇటీవల డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. లద్దాఖ్ (Ladakh) భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో కౌంటీలను ఏర్పాటుచేస్తోంది. ఈ విషయంపై భారత్ (India) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి దురాక్రమణను ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టంచేసింది. ఈ పరిణామాల వేళ.. అలాంటి పోస్టులు కలకలం సృష్టిస్తాయని, వాటిని దూరంగా ఉండాలని ఆర్మీ హెచ్చరిస్తోంది.