ఆపరేషన్ సిందూర్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ కొత్త డ్రామా బట్టబయలు

ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడు నెలలవుతున్నా, భారత సైనిక స్థావరాలపై దాడులు జరిగాయంటూ పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారం మరోసారి బయటపడింది. పంజాబ్, అమృత్సర్ సమీపంలోని భారత రక్షణ స్థావరాలు ధ్వంసమయ్యాయని కొన్ని నకిలీ శాటిలైట్ చిత్రాలను పాక్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే, క్షేత్రస్థాయి పరిశీలనలో అక్కడ ఎలాంటి నష్టం జరగలేదని, భారత సైనిక స్థావరాలన్నీ క్షేమంగా ఉన్నాయని స్పష్టమైంది. పాక్ విడుదల చేసిన చిత్రాల్లో పేలుడు గుర్తులు గానీ, శిథిలాలు గానీ లేకపోవడం గమనార్హం.
తన దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, అంతర్జాతీయంగా అబద్ధాలను ప్రచారం చేసేందుకే పాకిస్థాన్ ఈ కుట్ర పన్నిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మే నెలలో జరిగిన సైనిక చర్యల సమయంలో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిన పాక్, ఇప్పుడు ఏడు నెలల తర్వాత ఆధారాలు లేని చిత్రాలను సృష్టించడం హాస్యాస్పదంగా ఉంది. పాకిస్థాన్ గతంలో కూడా ఇలాంటి అనేక అసత్య ప్రచారాలు చేసి, ప్రతిసారీ భారత్ చేతిలో అభాసుపాలైంది.