ఆపరేషన్ సిందూర్ తర్వాత రష్యా నుండి మరో 288 ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేయనున్న భారత్

రష్యా నుండి సుమారు 10,000 కోట్ల రూపాయల వ్యయంతో 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి) ఆమోదం తెలిపింది. ఇందులో 120 స్వల్ప శ్రేణి మరియు 168 సుదూర శ్రేణి క్షిపణులు ఉన్నాయి. మే 2025లో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఉపయోగించిన క్షిపణుల స్టాక్ను భర్తీ చేయడానికి మరియు దేశ వైమానిక రక్షణను మరింత బలోపేతం చేయడానికి ఈ వేగవంతమైన కొనుగోలు ప్రక్రియను చేపట్టారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 క్షిపణుల ధాటికి భయపడి పాకిస్థాన్ తన యుద్ధ విమానాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ క్షిపణులతో పాటు డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి ‘పాంట్సిర్’ వ్యవస్థలను కూడా కొనుగోలు చేయాలని వైమానిక దళం యోచిస్తోంది. మొత్తం మీద 3.6 లక్షల కోట్ల రూపాయల విలువైన రక్షణ ప్రతిపాదనలకు డిఎసి అనుమతి ఇచ్చింది, వీటిలో అత్యధికం స్వదేశీ పరిజ్ఞానంతో తయారుకానున్నాయి.