ఆకాశాన్నంటుతున్న ఎల్పీజీ ధరలకు చెక్ పెట్టనున్న సరికొత్త ఇంధనం ‘డిఎంఇ’ సామాన్యుడి వంటగది బడ్జెట్ను కాపాడగలదా

అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరల పెరుగుదల మరియు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ ఇప్పుడు శక్తివంతమైన ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసింది. డైమిథైల్ ఈథర్ (డిఎంఇ) అనే ప్రత్యామ్నాయ ఇంధనం ద్వారా దేశీయ గ్యాస్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. మిథనాల్ ఉపయోగించి కృత్రిమంగా తయారు చేసే ఈ స్వచ్ఛమైన ఇంధనం బొగ్గు, సేంద్రీయ వ్యర్థాలు మరియు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ నుండి ఉత్పత్తి చేయబడుతుంది. దీని రసాయన లక్షణాలు ఎల్పీజీని పోలి ఉండటమే కాకుండా, తక్కువ కాలుష్యాన్ని విడుదల చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.
సాధారణంగా కొత్త ఇంధనం మార్కెట్లోకి వచ్చినప్పుడు స్టౌలు లేదా సిలిండర్లు మార్చాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతారు. అయితే డిఎంఇ విషయంలో అటువంటి ఇబ్బందేమీ లేదు. ప్రస్తుతం మన ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు, రెగ్యులేటర్లు, పైపులు మరియు స్టౌలను ఎటువంటి మార్పులు లేకుండానే ఈ గ్యాస్ కోసం ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వాణిజ్య మరియు గృహ అవసరాల కోసం ఎల్పీజీలో డిఎంఇని కలిపి ఉపయోగించేందుకు అవసరమైన ప్రమాణాలను ఖరారు చేసింది.
శక్తి రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా సీఎస్ఐఆర్-నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేశారు. ఇప్పుడు ఈ స్వదేశీ ఇంధనాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రతి ఇంటికీ చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళిక అమలైతే, అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా వంటగ్యాస్ ధరలు స్థిరంగా ఉంటాయి. ఇది కేవలం దేశ ఇంధన భద్రతనే కాకుండా, సామాన్య ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే ఒక గొప్ప విప్లవంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.