అమరావతి పునర్నిర్మాణానికి మద్దతు కోరుతూ చంద్రబాబు ఢిల్లీకి
March 17, 2025

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రేపు (మంగళవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు ఆయన ఈ పర్యటన చేపడుతున్నారు. బుధవారం మోదీతో సమావేశమవనున్న చంద్రబాబు, అమరావతి అభివృద్ధికి అవసరమైన కేంద్ర సహాయంపై చర్చించే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు నిధులు, రాష్ట్రానికి నిధుల కేటాయింపు, ఇతర ప్రాజెక్టుల మద్దతుపై ప్రధానమంత్రితో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కీలక కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర సహాయంపై భరోసా పొందడం చంద్రబాబు పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.