అంటువ్యాధుల మరణాలకు ఊబకాయమే ప్రధాన కారణం, ప్రతి 10 మందిలో ఒకరు అధిక బరువు వల్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం ఇప్పుడు కేవలం డయాబెటిస్ లేదా గుండె జబ్బులకే పరిమితం కాకుండా, ప్రమాదకరమైన అంటువ్యాధుల వల్ల సంభవించే మరణాలకు కూడా ప్రధాన కారణంగా మారుతోంది. ప్రఖ్యాత వైద్య పత్రిక ‘ది లాన్సెట్’ ప్రచురించిన అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించిన ప్రతి 10 మరణాలలో ఒకటి ఊబకాయంతో ముడిపడి ఉంది. ఫిన్లాండ్ మరియు బ్రిటన్కు చెందిన సుమారు 5.4 లక్షల మందిపై 14 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో, ఊబకాయం ఉన్నవారికి ఇన్ఫెక్షన్ల కారణంగా ఆసుపత్రిలో చేరే లేదా మరణించే ప్రమాదం 70 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ముఖ్యంగా తీవ్రమైన ఊబకాయం ఉన్నవారిలో ఈ ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది.
భారతదేశంలో దాదాపు 24 శాతం మంది మహిళలు మరియు 23 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఉన్న నేపథ్యంలో ఈ నివేదిక కలకలం రేపుతోంది. ఊబకాయం శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని, దీనివల్ల ఫ్లూ, నిమోనియా, కోవిడ్ మరియు యూరిన్ ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులు ప్రాణాంతకంగా మారుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించిన 54 లక్షల మరణాలలో సుమారు 6 లక్షల మరణాలకు ఊబకాయమే మూలమని అంచనా. కాబట్టి, మారుతున్న జీవనశైలిలో ఇన్ఫెక్షన్ల బారి నుండి ప్రాణాలను కాపాడుకోవాలంటే బరువును అదుపులో ఉంచుకోవడం ఇప్పుడు తప్పనిసరి అని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.